నుమాయిష్ సందర్శకుల కోసం మెట్రో సర్వీసు పొడిగింపు

అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్ : నాంపల్లిలో ఆదివారం నుంచి ప్రారంభమైన నుమాయిష్ సందర్శకుల కోసం మెట్రో సర్వీసులను అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు మెట్రో ఆఖరి రైలు బయలుదేరుతుండగా.. దానిని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు. నుమాయిష్ పూర్తయ్యే వరకు.. అంటే ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగుతుందని ఆయన వివరించారు.

మియాపూర్‌-ఎల్బీనగర్‌, నాగోల్‌ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గాంధీభవన్‌ మెట్రో స్టేషన్‌లో టిక్కెట్‌ కౌంటర్లను 6కు పెంచినట్లు వివరించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులను నడిపించినట్లు తెలిపారు. మెట్రో రైళ్లలో మద్యం సేవించకూడదని, మెట్రో సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.