తెలంగాణలో ప్రతి డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు – సీఎం ప్రకటన
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/CM-Revanth-Reddy-review-meeting-on-state-emblem-and-anthem-today.jpg)
తెలంగాణలో ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న ‘తెలంగాణ తల్లి’ ఉత్సవాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని పిలవాలనుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా దీన్ని ఉద్యమ ప్రతీకగా నాయకులు ముందుకు తీసుకువచ్చారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత బీఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల తరవాత కంప్యూటర్పై తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చిన వ్యక్తి బీవీఆర్ చారి. సాధారణ స్త్రీ మాదిరిగా కొంగు నడుముకి చుట్టుకొని ఉన్న తెలంగాణ రూపాన్ని ఆయన చిత్రించాడు. ఈ రూపంలో దేవులపల్లి అజయ్ సారథ్యంలో వెలువడుతున్న ప్రజాతంత్ర అనే తెలంగాణ వారపత్రిక కవర్ పేజీపై మొదటిసారిగా ప్రచురితమైంది. అనంతరం గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లికి మార్పులు చేస్తూ ప్రస్తుతం ఉన్న మాదిరిగా తయారు చేశారు.