నేడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

telangana-congress-political-affairs-committee-meeting-today

హైదరాబాద్‌ః కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, ఇతర సభ్యులు పాల్గొననున్నారు. ఇక ఈ భేటీలో కాంగ్రెస్ బస్సు యాత్ర విధివిధానాలు, పార్టీ అగ్రనాయకుల పర్యటన పై ప్రధానంగా చర్చ జరగనుంది. తిరగబడదాం-తరిమికొడదాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నాయకుల మధ్య ఐఖ్యత చాటేందుకు బస్సు యాత్ర చేపడుతున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ప్రకటన.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రచార ప్రణాళిక ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.

మరోవైపు అలంపూర్ నుంచి బస్సుయాత్ర ప్రారంభానికి పీసీసీ యోచన చేస్తున్న విషయం తెలిసిందే. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తోంది. 15న ప్రియాంక గాంధీ బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. యాత్రలో 2 రోజులపాటు పాల్గొననున్నారు. 18,19న బస్సుయాత్రలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. ఇక మేనిఫెస్టోను రాహుల్‌ చేత విడుదల చేయించాలని టీపీసీసీ యోచిస్తోంది.