నేడు తెలుగు రాష్ట్రాల సిఎస్ల భేటీ
విభజన సమస్యలు, నదీ జలాలు, ఆస్తుల పంపకాలపై చర్చ
అమరావతి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్కుమార్, నీలం సాహ్నిలు శుక్రవారం అమరావతిలో భేటీ కానున్నారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లో నెలకొన్న విభజన సమస్యలతో పాటు నదీ జలాలు, ఆస్తుల పంపకాలు తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న 9,10 షెడ్యూల్ సంస్థల విభజన సమస్యలు పై కూడా చర్చలు జరగనునున్నాయి. చర్చల్లో ప్రధానంగా ఏపిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి వచ్చే దిశగా, నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టిఎన్జిఒ సంఘం భావిస్తోంది. అలాగే ఏపి విద్యుత్ ఉద్యోగుల గురించి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ అనంతరం విభజన, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందడుగులు వేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇరు రాష్ట్రాల సిఎంలు జగన్, కెసిఆర్ జరిపిన భేటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్కుమార్, నీలం సాహ్ని లు ఈ కీలక భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/