ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ అయ్యింది. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు తొలగించి వైస్సార్ పేరు పెట్టింది జగన్ సర్కార్. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.

సభలో మంత్రి రజనీ మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్‌ కు గౌరవం ఉందని స్పష్టం చేశారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని…దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైస్సార్ పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి వంద యూనివర్సిటీలకు అయినా వైస్సార్ పేరు పెట్టాలని మంత్రి రజని అన్నారు.

మరోపక్క ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సీటీ పేరు మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం నిర్ణయంపై ఎన్టీఆర్‌ అభిమానుల్లోనూ ఆగ్రహం పెల్లుబికింది. ఎన్టీఆర్‌ పేరును ఎలా తీసేస్తారంటూ ఆందోళనలు చేస్తున్నారు. విజయవాడ గొల్లపూడిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు మాజీ మంత్రి దేవినేని ఉమ. అటు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పుపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మనస్తాపం చెందారు. అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు యార్లగడ్డ ప్రకటించారు.

ఎన్టీఆర్‌ పేరు తొలగించడమంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనంటూ ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు సైతం కామెంట్ చేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్చి వైస్సార్ పేరు పెట్టాలనుకోవడంపై టీడీపీతో సహా వివిధ పార్టీలు, సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. టీడీపీకి మద్దతుగా బీజేపీ సహా పలు విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి.