పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల క్లీన్ స్వీప్ ఫై చంద్రబాబు హర్షం

ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామభూపాలరెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

“పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు అభ్యర్ధులకు అభినందనలు. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ఎదిరించి నిలబడిన కార్యకర్తలకు, నాయకులకు సెల్యూట్. ఇది ప్రజా విజయం, మార్పునకు సంకేతం. మంచికి మార్గం… రాష్ట్రానికి శుభసూచకం” అని అభివర్ణించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి శాసనమండలికి వెళుతున్న వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరుతున్నానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ ఊహించనివిధంగా మూడింటికి మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం తో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.