ఎట్టకేలకు చిక్కిన 21,000 రివార్డ్‌ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతి

Madhya Pradesh, Rajgarh, Most Wanted Monkey: Capture Of Monkey After 20 Attacks Ends Madhya Pradesh Town’

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో దాదాపు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్‌ ఉన్న ‘మోస్ట్‌ వాంటెడ్‌’ కోతిని ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్‌ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు. ఒక కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్లపై తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్‌ సిబ్బంది చేతులెత్తేశారు. అలాగే కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ కోతిని పట్టుకున్న వారికి రూ.21,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు.

కాగా, జిల్లా కలెక్టర్‌ చొరవతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు బుధవారం చేరుకుంది. మున్సిపల్‌ సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆ కోతిని పట్టుకునేందుకు నాలుగు గంటలు శ్రమించారు. డ్రోన్‌ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చారు. మగతలో ఉన్న ఆ కోతిని పట్టుకుని బోనులో బంధించారు. ఈ సందర్భంగా స్థానికులు జై శ్రీరామ్‌, జై భజరంగ్‌ దళ్‌ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు మత్తు వీడిన తర్వాత బోనులో బంధించిన ఆ కోతి ఆగ్రహంతో రగిలిపోయింది. బోను నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించింది. అయితే మనుషులకు ప్రమాదకరంగా మారిన ఆ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖకు చెందిన రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, ‘మోస్ట్‌ వాంటెడ్‌’ కోతిని పట్టుకునేందుకు ప్రకటించిన రూ.21,000 రివార్డును ఆ టీమ్‌కు అందజేస్తామని రాజ్‌గఢ్‌ మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు.