నన్ను అంతం చేసేందుకు టిడిపి ప్రయత్నిస్తోందిః ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
తనపై దాడిలో 400 మంది పాల్గొన్నారన్న బ్రహ్మనాయుడు
అమరావతిః పల్నాడు జిల్లా వినుకొండ నిన్న యుద్ధ రంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సిపి నేతల అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ టిడిపి చేపట్టిన నిరసన ర్యాలీ చివరకు హింసాయుతంగా మారింది. టిడిపి, వైఎస్ఆర్సిపి శ్రేణులు కర్రలు, రాళ్లతో దాదుల చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు బ్రహ్మనాయుడు కారుపై కూడా టిడిపి శ్రేణులు దాడి చేశాయి.
ఈ నేపథ్యంలో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. టిడిపిపై విమర్శలు గుప్పించారు. తనను అంతం చేసి ఎన్నికల్లో గెలవాలని టిడిపి భావిస్తోందని చెప్పారు. తనపై దాడిలో దాదాపు 400 మంది పాల్గొన్నారని అన్నారు. తనను అడ్డు తొలగించుకుంటే వినుకొండలో సులభంగా గెలవొచ్చని టిడిపి భావిస్తోందని చెప్పారు. టిడిపి శ్రేణుల దాడిలో తన గన్ మెన్ కు కూడా గాయాలయ్యాయని తెలిపారు.