హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలోకి టీడీపీ

అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక

హుజూరాబాద్‌ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సమాయత్తమవుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీడీపీ బరిలోకి దిగుతుందని ఆ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. నిన్న హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక్కడి నుంచి బరిలోకి దిగే అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు త్వరలోనే ప్రకటిస్తారని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి టీడీపీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు.

కాగా, అక్టోబరు 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. రేపు నోటిఫికేషన్ విడుదల కానుండగా, నామినేషన్ల దాఖలకు అక్టోబరు 8 చివరి తేదీ. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. నవంబరు 2న ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల బరిలో ఉండగా, కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/