‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్’ – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ లో అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల మధ్య వార్ ఎక్కువ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి విమర్శలు చేస్తూ వస్తున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..ఏ ఫ్లాట్ ఫామ్ ను వదలకుండా కాంగ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా ‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్’ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్‌ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.

కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000 లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్‌ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ రీయాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.