కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

ఉల్లి ధర మళ్లీ కొండెక్కింది. మొన్నటి వరకు కేజీ రూ.10 ఉన్న ఉల్లి..నేడు రూ. 60 కి చేరింది. దీపావళి నాటికీ రూ.100 వరకు వెళ్లిన ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ వర్గాలు అంటున్నారు. మొన్నటి వరకు ఎన్నడూలేని విధంగా సామాన్యులను టమాట ధరలు ఎంతగా ఇబ్బంది పెట్టాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మిర్చి ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. ఇక ఇప్పుడిప్పుడే కూరగాయల ధరలు ఒక్కొక్కటిగా అదుపులోకి వస్తున్నాయి అని సామాన్యులు సంతోషపడేలోగా ఉల్లి ధర కొండెక్కడం షురూ అయింది. తెలంగాణలో వారం రోజులుగా.. ఉల్లి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.

ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి.. సెప్టెంబరుకి నాలుగు కేజీలక చేరింది. ఇక ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.50 వరకు ఉంది. ఆగస్టు ముందు వరకు రూ.16 నుంచి రూ.18 ఉన్న ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాలు సరిగా లేకపోవడం వల్ల కర్నూలు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఇదీ పరిస్థితి ఉండట వల్లే ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.