ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

దివాక‌ర్ ట్రావెల్స్ పేరిట ట్రావెల్స్ సంస్థ‌ను న‌డుపుతున్న జేసీ ప్ర‌భాకర్ రెడ్డి

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

అమరావతిః టిడిపి సీనియర్‌ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి శుక్ర‌వారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి వ‌చ్చారు. త‌న కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డితో క‌లిసి వ‌చ్చిన ఆయ‌న ఈడీ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ విచారణలో భాగంగా ప్రభాకర్ రెడ్డి అధికారులు మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. భోజనం తర్వాత తిరిగి ప్రభాకర్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు.

దివాకర్ ట్రావెల్స్ పేరిట జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ట్రావెల్స్ సంస్థ‌ను న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ల‌కు సంబంధించి ప్ర‌భాక‌ర్ రెడ్డి ప‌లు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ గ‌తంలో ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల్లో భాగంగా బీఎస్‌-3 వాహనాల‌ను బీఎస్‌-4 వాహ‌నాలుగా పేర్కొంటూ రిజిస్ట‌ర్ చేయించారంటూ ప్ర‌భాక‌ర్ రెడ్డిపై గ‌తంలో ఈడీ ఓ కేసు న‌మోదు చేసింది. ఈ కేసు విచార‌ణ నిమిత్తం విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసుల మేర‌కే ప్ర‌భాక‌ర్ రెడ్డి ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/