దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూత

చిత్రసీమ లో వరుస విషాదాలు అభిమానులను , సినీ ప్రముఖులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నిన్న మంగళవారం ప్రముఖ నిర్మాత నారంగ్ అనారోగ్యం తో మృతి చెందగా..ఈరోజు ఉదయం ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. 1966 నుంచి సినీ రంగానికి సేవలందించిన రామారావు.. దాదాపు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు. రామారావు తొలి సినిమా నవరాత్రి. డైరెక్టర్ గా పనిచేయడానికి ముందు ఆయన తన కజిన్‌ తాతినేని ప్రకాశ్‌రావు దగ్గర, కోటయ్య ప్రత్యగత్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎన్టీఆర్ తో యమగోల, రాజేంద్రప్రసాద్ తో గోల్ మాల్ గోవిందం, కృష్ణతో అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. తెలుగులో కంటే హిందీలోనే రామారావు ఎక్కువగా సినిమాలు చేయడం విశేషం. బాలీవుడ్‌లోకి వెళ్లాక దాదాపు అన్ని రీమేక్‌ చిత్రాలే చేశారు. తమిళంలో హిట్‌ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేసి హిట్‌ కొట్టారు. 1966 నుంచి 2000 వరకు తెలుగు, హిందీల్లో కలిపి 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.