మహానాడు వేదికకు రైతులే స్థలాన్ని ఇచ్చారు: అచ్చెన్నాయుడు
మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా?
మళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వస్థితి రావాలని రైతులు కోరుకుంటున్నారు..
ఒంగోలు: టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ హక్కులు ఉంటాయని, రాష్ట్రంలో ఆ హక్కులను కాలరాసే విధంగా వైస్సార్సీపీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. ”మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా? ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోతే మండువవారి పాలెంలో స్థలం ఎంపిక చేశాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సమర్థంగా పనిచేసే పార్టీ టీడీపీ మాత్రమే. ఈ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి పూర్వస్థితి రావాలంటే టీడీపీ అధికారంలో రావాలని కోరుకుంటూ మండువవారి పాలెంలో రైతులు మహానాడు ఏర్పాటు చేసుకోవడానికి వారి స్థలాన్ని ఇచ్చారు.
రైతులు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. గతంలో మహానాడు మూడు రోజులు నిర్వహించే వాళ్లం. ఈ సారి ఎండలు అధికంగా ఉన్నాయి.. అందుకే రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నాం. 27న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 వేల మందితో సభ నిర్వహిస్తున్నాం. ఆ రోజు 17 తీర్మానాలు ప్రవేశ పెడతాం. అలాగే, తదుపరి రోజు నిర్వహించే సమావేశంలో సాయంత్రం 3 గంటలకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభిస్తున్నాం. గ్రామాల్లో వైస్సార్సీపీ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు వైస్సార్సీపీ వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు” అని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/