మహిళల కోసం రేపు తనీరా శారీ రన్ కార్యక్రమంః నారా బ్రాహ్మణి

Taneira Saree Run program for women tomorrow.. Nara Brahmani

అమరావతిః అతివల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మహిళా సాధికారత, స్త్రీలలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రేపు (మార్చి 17) హైదరాబాదులో చీరకట్టుతో పరుగుపందెం నిర్వహిస్తున్నారు. ఈ శారీ రన్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వేదిక కానుంది.

ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం పేరు తనీరా శారీ రన్. మహిళలు చీరకట్టుతో ఈ రన్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ వినూత్న పరుగును హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేశారు.

“మీ అందరినీ తనీరా శారీ రన్ లో కలుసుకోబోతున్నందుకు ఉద్విగ్నంగా ఉంది. ఈ కార్యక్రమం అతివలను, ఆరోగ్యం పట్ల మహిళల్లో అవగాహన కలిగించే వారందరినీ ఒక్కచోటికి చేర్చుతుంది. మన సంప్రదాయ దుస్తులు ధరించి సగర్వంగా ఈ కార్యక్రమంలో పాల్గొందాం. ఇప్పటివరకు అనుసరించిన మూస ధోరణులకు స్వస్తి పలుకుదాం” అని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ నెల 17న నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద మీ అందరినీ కలుస్తాను అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.