హైదరాబాద్‌లో సన్‌బర్న్‌ వేడుక.. సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

అనుమతి ఇవ్వకుండానే బుకింగ్ లు ఎలా ప్రారంభించారన్న రేవంత్

CM Revanth Reddy

హైదరాబాద్‌: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సన్ బర్న్ వేడుక దుమారం రేపుతోంది. మాదాపూర్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే, ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు ఇంకా అనుమతిని ఇవ్వలేదు. అయినప్పటికీ బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ… ఈవెంట్ కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అనుమతిని ఇవ్వకుండానే బుకింగ్ లు ఎలా ప్రారంభించారని అడిగారు. దీంతో, సైబరాబాద్ పోలీస్ అధికారులు బుక్ మై షో ప్రతినిధులను పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు. హద్దు మీరితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్ బర్న్ అనేది భారీ స్థాయిలో నిర్హహించే సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. ఈ వేడుల్లో మద్యం అనుమతి ఉంటుంది.