ప్రయాణికుల రద్దీ.. కాచిగూడ- కాకినాడ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
మరికొన్ని రైళ్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించిన అధికారులు

హైదరాబాద్ః ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ- కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పలు రైళ్లను వేసవి రద్దీ కారణంగా పొడిగించనున్నట్లు తెలిపింది. మే 13 (శనివారం)న రైలు నెంబర్ 07417 కాచిగూడ నుంచి రాత్రి 8:45 గంటలకు బయలుదేరి మే 14 (ఆదివారం) ఉదయం 8:40 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
రైలు నెంబర్ 07418 కాకినాడ టౌన్లో మే 14 (ఆదివారం) రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మే 15 (సోమవారం) ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ కోచ్ లతో పాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు. ఈ రైళ్లకు కాజిపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.