టిడిపి సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన స్పీకర్

స్పీకర్ ఛైర్ వద్దకు వచ్చి ఆందోళన చేసిన టిడిపి సభ్యులు

Speaker suspended TDP members from assembly

అమరావతిః ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టిడిపి సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టిడిపి సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు.

మరోవైపు, టిడిపి సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టిడిపి సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టిడిపి సభ్యులు… బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టిడిపి సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.