బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆరోగ్యంపై స్పందించిన ప్రధాని మోడీ

PM Modi wishes speedy recovery to Britain’s King Charles III

న్యూఢిల్లీః బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో చార్లెస్‌-3 ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సైతం కింగ్‌ చార్లెస్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాగా, కింగ్‌ చార్లెస్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు బ్రిటన్‌ రాజకుటుంబం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని.. రాజుకు ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వైద్య పరీక్షల్లో వ్యాధి బయటపడినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది.

75 ఏండ్ల చార్లెస్‌-3 తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022, సెప్టెంబర్‌ 8న రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2023, మే 6న పట్టాభిషేకం చేశారు. కాగా, క్యాన్సర్ సమస్యపై అవగాహన పెంచడం కోసమే ఆయన తన చికిత్స గురించి బయటకు వెల్లడించారని కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం ‘ఔట్‌డోర్ పేషంట్’గా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.