సీఎం కేసీఆర్‌ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ముఖ్య సలహాదారుగా సోమేశ్‌కుమార్‌కు కేబినెట్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది. గతంలో సోమేశ్‌కుమార్ తెలంగాణ సీఎస్‌గా పనిచేయడం జరిగింది. కాగా శుక్రవారం ఉదయం సచివాలయంలో తనకు కేటాయించిన చాంబర్‌లో సోమేశ్ తన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సోమేశ్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు.

సోమేశ్‌కుమార్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం కలెక్టర్‌ సహా వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలందించారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా, 2016లో ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. ఈ ఏడాది జనవరిలో హైకోర్టు ఏపీ కేడర్‌కు చెందిన అధికారిగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత డీవోపీటీ ఏపీకి బదిలీ చేసింది. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది.