ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు

Congress

న్యూఢిల్లీః రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా ఓటువేసిన ఆరుగురు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటువేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై వేటు వేసినట్టు శాసనసభాపతి తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వీరిపై అనర్హత వేటు వేశామని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిన తర్వాత సంక్షోభంలో కూరుకుయిన కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కింది. సుఖ్వీందర్‌సింగ్ సుఖు సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్‌ను విజయవంతంగా ఆమోదించింది. కాగా, తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మంత్రి విక్రమాదిత్యసింగ్ మరోమారు స్పందించారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు ముగిసే వరకు రాజీనామా చేయబోనని ప్రకటించడంతో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు, రాజీనామా ఊహాగానాలను ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ఖండించారు. రాజీనామా చేయాలని అధిష్ఠానం తనను కోరలేదని స్పష్టం చేశారు.