ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన సీతారామం

వెండితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీతారామం..ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. ఈ మేరకు ఓటిటి రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

కేవలం టాక్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రిలీజైన రోజునుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా రూ. 80 కోట్లకు పైగానే వసూళ్ళు సాధించింది. బాలీవుడ్ లోనూ విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ కాబోతోంది. భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని అమెజాన్ వారు కైవసం చేసుకున్నట్టు సమాచారం.