రీ రిలీజ్ కలెక్షన్లలో కూడా సింహాద్రి దుమ్ములేపింది

రీ రిలీజ్ కలెక్షన్లలో కూడా సింహాద్రి దుమ్ములేపింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’, రామ్ చరణ్ ఆరెంజ్ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘సింహాద్రి’ సైతం నిన్న (మే 20) రీ రిలీజ్ అయ్యింది.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సెన్షేషనల్ బ్లాక్‌బస్టర్ ‘సింహాద్రి’. 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. రీ రిలీజ్ అయిన మొదటి రోజు నందమూరి అభిమానుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టినట్లు నందమూరి ఫ్యాన్స్ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు.

అందులో ఫస్ట్ డే ఏపీ తెలంగాణలో కలిపి రూ. 4.95 కోట్లు గ్రాస్ను రాబట్టినట్లు చెప్పారు. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు ఓవర్సీస్లో రూ. 67 లక్షలు వసూలు చేసిందట. రీ రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లోనూ సత్తా చాటుకున్న ‘సింహాద్రి’ మూవీ మొదటి రోజు ఏకంగా రూ. 6.02 కోట్లు గ్రాస్ను వసూలు చేసినట్లు ఫ్యాన్స్ అధికారికంగా వెల్లడించారు. ఇదే నిజమైతే సినిమాల రీ రిలీజ్ల శకంలో సరికొత్త సంచలనం నమోదు అయినట్లు చెప్పాలి.