నేడు కడప నేతలతో షర్మిల సమావేశం
అమరావతిః ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.