రైతుల కన్నీళ్లు కెసిఆర్ దొరకు కనిపించడం లేదు: షర్మిల

కేసీఆర్ నిర్వాకంతో మరో రైతు గుండె ఆగిపోయింది: వైఎస్ షర్మిల

హైదరాబాద్: పెద్ద రైతునని చెప్పుకునే సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. రెండు నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా… దొరకు కనిపించడం లేదని దుయ్యబట్టారు. వడ్లు కొనకుండా రాష్ట్రంలో ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారని… కేసీఆర్ నిర్వాకంతో మరో రైతు గుండె ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అబాదీ జమ్మికుంటలో ఓ రైతు చనిపోయిన వార్తను ట్విట్టర్ లో షేర్ చేశారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు.

ఇంకెంత మంది రైతుల ఉసురు తీస్తే మీ కళ్లు చల్లబడతాయని షర్మిల అడిగారు. కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నావని, యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నావని మండిపడుతున్నారు. వడ్లు కొనమని రైతులతో కాళ్లు మొక్కించుకుంటున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది రైతు ప్రభుత్వం కాదని… రైతును కాల్చుకుతింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వమని దుయ్యబట్టారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/