మరోసారి యథాతథంగా కీలక వడ్డీ రేట్లు

ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించడంతోపాటు ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగానే ఉంచింది. ప్రస్తుత పరిస్థితులు, అందరి అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ ద్వైమాసిక పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌ భయాందోళన, అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పులుచేయలేదు. అందుకే రాబోయే ద్రవ్య విధానంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాల స్థాయిలు మహమ్మారికి ముందు దశకు చేరుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రెపో రేటు 4 శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుందని తెలిపారు. అయితే.. కమిటీలోని ఆరుగురిలో ఐదుగురు రేట్లను స్థిరంగా కొనసాగించాలని ఓటు వేయగా.. ఒకరు వ్యతిరేకించారు. 5:1 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదోసారని పేర్కొన్నారు. కాగా.. కరోనాతో క్షీణించిన ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చేందకు ఆర్‌బీఐ చివరిసారి 2020 మేలో రెపోరేటును 4 శాతానికి కుదించింది.

కోవిడ్‌ కారణంగా క్షీణించిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటుందంటూ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రటకించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఇటీవల పన్నులు తగ్గించిన నేపథ్యంలో వినిమయ గిరాకీ పుంజుకుంటుందని.. అలాగే నవంబరులో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశంగా ఉందన్నారు.

కాగా.. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల ఒడుదొడుకుల నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. అక్టోబరు- డిసెంబరులో 5.1శాతం, జనవరి- మార్చిలో 5.7శాతం, ఏప్రిల్‌-జూన్‌లో శాతం, జులై-సెప్టెంబరులో 5శాతం ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) వృద్ధిరేటు అంచనాను 9.5 శాతంగా కొనసాగించింది. అక్టోబరు- డిసెంబరులో 6.6, జనవరి- మార్చిలో 6.4, ఏప్రిల్‌-జూన్‌లో 17.2, జూలై-సెప్టెంబరులో 7.8 శాతంగా వృద్ధి రేటును ఆర్‌బీఐ అంచనా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/