తెలుగు రాష్ట్రాల్లో 48 గంటల పాటు వర్ష సూచన

నేటి సాయంత్రం నుంచి భారీ వర్షాలు..హెచ్చరించిన వాతావరణ శాఖ

Heavy Rain
Heavy Rain

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించడంతో తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. దీంతో నేటి సాయంత్రం నుంచి రానున్న 48 గంటల వరకూ పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.

గడచిన 24 గంటల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదైందని, రానున్న రెండు రోజుల్లో మాత్రం భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం అది ఒడిశాకు తూర్పున కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే, ఒడిశాపై అధికంగా ఉంటుందని, అయితే, ఉపరితల ద్రోణి కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున్నాయని హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/