రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే – షర్మిల

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అన్నారు YSRTP అధినేత్రి వైస్ షర్మిల. ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై యావత్ ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ క్రమంలో వైస్ షర్మిల స్పందించారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని పేర్కొన్నారు. విపక్షాల గొంతు నొక్కడం, కక్ష సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యంలో తగదని హితవు పలికారు. వాదనలు వినిపించేందుకు రాహుల్ గాంధీకి 30 రోజుల సమయం ఉన్నప్పటికీ, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం నిరంకుశ చర్య అని షర్మిల విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో, ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. బీజేపీ చర్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని, ప్రతిపక్షాలపై అణచివేత తగదని షర్మిల అన్నారు. రాజకీయ వైరుధ్యాల కంటే రాజ్యాంగ విలువలు గొప్పవని, పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన అవసరం ఉందని షర్మిల అభిప్రాయపడ్డారు.