అతి త్వరలో సికింద్రాబాద్ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెరగబోతున్నాయి

పెద్ద పండగ వస్తుందంటే చాలు రైల్వే స్టేషన్లు , బస్టాండ్ లు ప్రయాణికులతో కిక్కిరిపోతాయి. దీంతో పండగలను క్యాష్ చేసుకుంటారు. బస్సు చార్జీలు పెంచడం , ప్రత్యేక బస్సు లు వేసి అదనపు చార్జీలు వసూళ్లు చేయడం, అలాగే రైల్వే స్టేషన్స్ ల్లోనూ ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచడం , ప్రత్యేక ట్రైన్స్ అందుబాటులోకి తీసుకరావడం , వాటికీ అధిక చార్జీలు వసూళ్లు చేయడం చేస్తుంటారు. ప్రస్తుతం ఇప్పుడు అదే చేస్తున్నారు. దసరా పండగను క్యాష్ చేసుకునే పనిలో పడింది దక్షిణ మధ్య రైల్వే.

దసరా సందర్బంగా ఏకంగా 315 ప్రత్యేక రైళ్లని నడుపుతున్నట్లు వెల్లడించింది. అలాగే కొన్ని స్పెషల్ ట్రైన్స్‌కి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఒకవేళ ప్రయాణికుల రద్దీ పెరిగితే అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్లాట్‌ఫామ్ టికెట్ల ధరలు కూడా పెంచినట్లు ఆయన ధ్రువీకరించారు. ఇప్పటికే కాచిగూడ, విజయవాడలో రూ.10 ఛార్జీలను రూ. 20కు పెంచామని.. త్వరలోనే సికింద్రాబాద్ స్టేషన్‌లో కూడా పెంచనున్నట్లు రాకేశ్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ టికెట్ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లపైకి అనవసరంగా వచ్చే వారిని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.