మెడికల్ కాలేజీల విషయంలో కేటీఆర్ vs కిషన్ రెడ్డి ట్వీట్స్ వార్
గడిచిన మూడేళ్లలో తెలంగాణకు తొమ్మిది మెడికల్ కాలేజీలు కేటాయించామంటూ కిషన్ రెడ్డి చేసిన ప్రకటనలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు కేంద్ర మంత్రి హోదాలో అసత్య ప్రచారాలు చేయడం తగదంటూ కిషన్ రెడ్డి ఫై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఒక సోదరుడిగా మిమ్మల్ని గౌరవిస్తానని.. కానీ, ఇలాంటి పచ్చి అబద్ధాలపై సహించను అంటూ ట్వీట్ చేశారు.
“గౌరవనీయులైన కిషన్రెడ్డి గారూ.. ఓ సోదరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తా, కానీ మీలా అసత్యాలు ప్రచారం చేసే కేంద్ర మంత్రిని నేను చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మెడికల్ కాలేజీలను కేటాయించిందంటూ మీరు ప్రకటించింది పచ్చి అబద్ధం. మీకు ఈ విషయమై క్షమాపణలు అడిగే ధైర్యం కూడా లేదు” అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.
‘హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని గతంలో ప్రకటించారు. కానీ ఎప్పటిలాగే దాన్ని మీ గుజరాతీ బాస్లు ఆ రాష్ట్రానికి తరలించారు. ఇంత జరుగుతున్నా మీ తప్పులను సరిదిద్దుకోకుండా.. మళ్లీ హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు బయ్యారం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. మీ గుజరాతీ బాస్లను సంతోష పెట్టడానికి అర్ధ సత్యాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఏ హామీని మీరు నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు’ అంటూ కేటీఆర్ విమర్శించారు.