నేడు విచారణకు హాజరుకాలేను..ఈడీకి రోహిత్ రెడ్డి మెయిల్
హైదరాబాద్ః ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈరోజు విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మెయిల్ ద్వారా సమాచారం అందించారు. తెలంగాణ రాష్ర్ట హైకోర్టులో తాను రిట్ పిటిషన్ దాఖలు చేశానంటూ ఈడీకి పంపిన మెయిల్ లో పేర్కొన్నారు. కోర్టులో పిటిషన్ ఉన్నందున తాను ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. హైకోర్టు విచారణ అనంతరం హాజరయ్యే విషయంపై తాను నిర్ణయం తీసుకుంటామని ఈడీ అధికారులకు పంపిన మెయిల్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా, మొయినాబాద్ ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను హైకోర్టు రద్దు చేసింది. సిట్ కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 63ను కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే సీబీఐ చేపట్టాలని జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. కేసులో కీలక వివరాలను మీడియాకు సీఎం కేసీఆర్ వెల్లడించడంతో నిందితులు పడుతున్న ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సిట్ ఎంక్వైరీ పక్షపాత ధోరణిలో జరుగుతుందన్న నిందితుల వాదనలో అర్థం ఉందని పేర్కొంది. సిట్, మొయినాబాద్ పోలీసుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/news/national/