కాంగ్రెస్ పార్టీలో చేరిన వైస్‌ షర్మిల

కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్

ysrtp-chief-ys-sharmila-joins-congress

న్యూఢిల్లీః వైఎస్‌ఆర్‌టిపి తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్‌ఆర్‌ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్‌ఆర్‌టిపిని విలీనం చేశానని వివరించారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌టిపి ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్‌ఆర్‌ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.