వరద సాయం ఆపేయండి..ఎస్‌ఈసీ ఆదేశం

Flood-Victims

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న వరద సాయాన్ని వెంటనే నిలిపేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి రావడంతో వరద సాయం పంపిణీతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా నిలిపేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు వరద సాయాన్ని ఆపేయాలని, ఎన్నికల తర్వాత యథావిథిగా వరద సాయాన్ని కొనసాగించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో వరద సాయానికి బ్రేక్ పడినట్లైంది.

కాగా, ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షానికి నగర వాసులందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కాలనీలన్నీ మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. దీన్ని గమనంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సహాయంగా బాధితులకు పది వేల రూపాయల చొప్పున అందించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం 550 కోట్లను వరద సాయం పేరిట నిధులను విడుదల చేసింది. అయితే… ఈ పంపిణీలో భారీగా అవినీతి జరిగిందని, లబ్ధిదారులకు దక్కకుండా పక్కదారి పట్టాయని తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సర్కార్… దగ్గర్లో ఉన్న మీ సేవ లేదా ఈ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. దీంతో నగరంలోని అన్ని చోట్ల ఆయా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/