విడాకులపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు విడాకుల అంశంపై కీలక తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు అంగీకరిస్తే వెంటనే విడాకులు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. పరస్పర అంగీకారం ఉంటే 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈమేరకు ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సుప్రీంకోర్టు సడలించింది.
వివాహ బంధం మెరుగుపర్చుకోవడానికి అవకాశం లేని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీం ఈ తీర్పు వెల్లడించడం గమనార్హం. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఈ బెంచ్లో జస్టిస్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు.