కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

2-terrorists-killed-in-encounter-in-j-and-k-army-stops-infiltration-attempt

శ్రీనగర్‌ః జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మచల్‌ వద్ద నియంత్రణ రేఖ గుండా చొరబాటు యత్నాన్ని భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు సంయుక్తంగా ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో కుప్వారా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘కుప్వారా పోలీసులు అందించిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా.. మచల్ సెక్టార్‌ లో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొన‌సాగుతోంది’ అని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.