సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు జరుపుతోందిః సజ్జల

జడ్జీలకు కూడా దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్న సజ్జల

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

అమరావతిః కొన్ని మీడియా సంస్థల చేతిలో టిడిపి అధినేత చంద్రబాబు పావుగా మారారేమోనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీకే అజెండా ఇచ్చి, వారికి కావాల్సినవి సమకూర్చి, లీడ్ చేసే స్థాయికి ఏపీలో మీడియా చేరుకుందని చెప్పారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కేసులో దర్యాప్తుకు సంబంధం లేకుండా కొందరు వ్యక్తులు ప్రభావితం చేస్తున్నారని అన్నారు. నిజాయతీపరులపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. న్యాయమూర్తులకు కూడా దురుద్దేశాలను ఆపాదిస్తూ కొన్ని ఛానల్స్ లో చర్చలు పెడుతున్నారని అన్నారు. మీడియా ప్రమేయం లేకుండా సీబీఐ విచారణ కొనసాగాలని డిమాండ్ చేశారు.

జగన్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న పార్టీ వైఎస్‌ఆర్‌సిపి అని… వైఎస్‌ఆర్‌సిపిలో చేరతానని వివేకా అడిగితే జగన్ స్వాగతించారని సజ్జల తెలిపారు. పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో జగన్ దే తుది నిర్ణయమని చెప్పారు. వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదని అన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని… కుటుంబ వ్యవహారాలు, ఆస్తి అంశాల్లో దర్యాప్తు జరపడం లేదని తెలిపారు.