వైజాగ్‌లో ప్రారంభమైన వెంకటేష్ ‘సైంధవ్’ సెకండ్ షెడ్యూల్

విక్టరీ వెంకటేష్ 75 వ మూవీ ‘సైంధవ్’ సెకండ్ షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభమైంది. ‘హిట్2’తో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లోనూ ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

వెంకీ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా రూపొందుతున్న ‘సైంధవ్’ సెకండ్ షెడ్యూల్‌ను మూవీ టీమ్ వైజాగ్‌లో ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బ్రేక్ తీసుకోని ‘సైంధవ్ టీమ్’.. గురువారం నుంచి వైజాగ్‌లో రెండో షెడ్యూల్‌ స్టార్ట్ చేసింది. కాగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలో కనిపించనున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం, ఎస్ మణికండన్ సినిమాటోగ్రఫీ, గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ అందిస్తున్నారు.