చేమగడ్డ పప్పు
రుచి: కొత్త వంటలు ‘చెలి’ పాఠకుల కోసం
కావలసిన వస్తువులు
కందిపప్పు – 200 గ్రాములు
చామగడ్డలు – 200 గ్రాములు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 1
కరివేపాకు – 2 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా
గరంమసాలా పొడి – 1/4 టీ స్పూన్
పసుపు -1/2 టీ స్పూన్
కారంపొడి – 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి ముద్ద – 1 టీస్పూన్
ఆవాలు / జీలకర్ర – 1/4 టీస్పూన్
టమాటా – 1
చింతపండు పులుపు – 1/4 కప్పు
ఉప్పు – తగినంత
నూనె – 3 టీస్పూన్
తయారుచేసే విధానం
కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాలి. చామగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేగనివ్వాలి.
ఇందులో పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి నిమిషం సేపు వేయించి చామగడ్డలు, వాటిని తగిన ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి.
చామగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాట వేసి ఇందులో చింతపండు పులుపు, అరకప్పు నీళ్లు కలిపి మూతపెట్టి ఉడికించాలి.
చామగడ్డలు మెత్తబడ్డ తరువాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి.
చివరలో గరంమసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/