టీడీపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నప్పటికీ..జగన్ ఎక్కడ వెనకడుగు వేయలేదు – రోజా

మూడు రాజధానుల విషయంలో జగన్ వెనకడుగు వేశారు అనగానే టీడీపీ‌ నాయకులు సంకలు గుద్దు కుంటున్నారని, మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నగరి ఎమ్మెల్యే రోజా స్పష్టం చేసారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె..మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంత వరకైనా దిగజారుతాడని అన్నారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రభుత్వం లాక్కుని ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి పంపించడం చూశామని, జరగని విషయాన్ని జరిగినట్లుగా ప్రజలందరిని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని రోజా ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు వెనుక ఉండి కేసులు వేయించి మూడు రాజధానులకు అడ్డుపడుతున్నారని, ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధిని మూడు ప్రాంతాల్లో చేయాలని సీఎం భావిస్తున్నట్లు రోజా వెల్లడించారు. కోర్టులో బిల్లు వెనక్కి తీసుకున్నారు అనగానే టీడీపీ‌ నాయకులు సంకలు గుద్దు కుంటున్నారని, మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.