వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మళ్ళపల్లి జాతీయ రహదారిపై ట్రాక్టర్‎ను వెనుక నుంచి గరుడ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా , 16 మందికి గాయాలు అయ్యాయి. కొత్తకోట మండలంలోని ముమ్మాళ్లపల్లి వద్ద నేషనల్ హైవేపై చెరకులోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి ఆర్టీసీ గరుడ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన బాధితులను పోలీసులు అంబులెన్స్లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మియాపూర్ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో క్లీనర్ సందీప్, డ్రైవర్‌ ఆంజనేయులతో పాటు ప్రయాణికుడు శివన్న ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం వల్ల ముమ్మాళ్ళపల్లి నుండి అమడబాకుల వరకు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
.