ఎమ్మెల్యే శంకర్ నాయక్‌ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో మరోసారి బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిన్న ములుగు లో పాదయాత్ర లో భాగంగా కేసీఆర్ ఫై , సర్కార్ ఫై పలు విమర్శలు చేయడం..ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారాయి. రేవంత్ వ్యాఖ్యల ఫై బిఆర్ఎస్ నేతలు , కార్యకర్తలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం..పలు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగానే మహబూబాబాద్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను టార్గెట్ చేసారు.

మహబూబాబాద్ లో రాక్షస పాలన నడుస్తోందన్న రేవంత్… కలెక్టర్లకు కూడా రక్షణ లేదని అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మహిళా కలెక్టర్ చేయి పట్టి గుంజిన దుర్మార్గడని ఆరోపించారు. రాజ్యాలను కూల్చి, రాచరికాన్ని బొందపెట్టిన ఘనత తెలంగాణ పౌరుషానిదని అన్నారు. మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములను ఎమ్మెల్యే గుంజుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘ఇక్కడ రాక్షస పాలన సాగుతోంది. కలెక్టర్లకు, కౌన్సిలర్లకు, పోడు భూములకు, పేదలకు ఇక్కడ రక్షణ లేదు. నకిలీ విత్తనాలతో మిర్చి రైతులను మోసం చేసిన వారిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టరు?’’ అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే బాగుపడతామని ఆడబిడ్డలు చెప్పారన్న ఆయన.. ఆర్టీసీ కార్మికులు తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. ఆర్టీసీలో దాదాపు సగం బస్సులు ప్రవైట్ వేనని , 50 వేల మంది చేయాల్సిన పనిని 40 వేల మందితో చేయిస్తున్నారని ఆరోపించారు. 2024 జనవరి 1 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్న రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వం రాగానే.. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలు, గిరిజనులకు పట్టాలిచ్చి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెడతామన్నారు.