సీఎం జగన్ నోట వంగపండు పాట

ప్రధాని మోడీ శనివారం ఏపీలో పర్యటిస్తున్నారు. రూ.10,742 కోట్లతో చేప‌ట్టిన‌ వివిధ ప్రాజెక్టులకు ప్ర‌ధానిమోడీ , ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఏయూలో జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం మోడీ సభకు తరలివచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా కవి, దివంగత వంగపండు ప్రసాద రావును సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘గాయకుడు వంగపండు మాటలు గుర్తుకు వస్తున్నయ్. ఏం పిల్లడో.. ఏళ్దాం వస్తవా.. అంటూ ఈరోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలిరావటం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్.. అన్నట్లుగా సభకు ప్రజలు హాజరయ్యారు.’ అని జగన్ వ్యాఖ్యనించారు.

ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులు అయితేనేమి, ప్రజలందరికీ వైద్య ఆరోగ్యం అయితేనేమి, రైతులు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన, ఈ రెండింటి వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలన ఇలా.. ఈ మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి, ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్ధిక వనరుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేశాం అని చెప్పుకొచ్చారు.