బీఎస్పీ ప్ర‌వీణ్ కుమార్‌తో చేయి క‌లిపిన రేవంత్..

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీ ప్ర‌వీణ్ కుమార్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేయి చేయి కలిపి ముచ్చటించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో చేరి , బిజెపి నుండి ఉప ఎన్నిక లో నిల్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి , టిఆర్ఎస్ నుండి ప్రభాకర్ బరిలో నిల్చున్నారు. ఈ మూడు పార్టీలే కాక బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) తో పాటు మరికొన్ని పార్టీలు సైతం బరిలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.

ఈ క్ర‌మంలో మంగ‌ళవారం మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్ర‌వీణ్ కుమార్ తార‌స‌ప‌డ్డారు. ఈ సందర్భంగా ప్ర‌వీణ్ కుమార్‌తో చేయి క‌లిపిన రేవంత్ ఫొటోల‌కు ఫోజులిచ్చారు. అంతేకాకుండా ప్ర‌వీణ్ కుమార్‌ను తాను క‌లిసిన విష‌యాన్ని కూడా ఆయ‌నే వెల్ల‌డించారు. త‌మ క‌ల‌యిక యాదృచ్ఛికమేన‌న్న రేవంత్‌… సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరమ‌ని వ్యాఖ్యానించారు‌. ప్ర‌వీణ్ కుమార్‌ను క‌ల‌వ‌డం త‌న‌కు సంతృప్తినిచ్చింద‌ని కూడా రేవంత్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.