ఆ రెండు రోజులు తిరుమల ఆలయం మూసివేత

తిరుమల ఆలయం రెండు రోజుల పాటు మూసివేస్తున్నారు. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయబోతున్నారు. గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజుల పాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటలపాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలకు అనుమతించబోమని భక్తులు దీనిని గమనించగలరని పేర్కొంది.

ఇక గ్రహణం సమయాలు… అక్టోబరు 25న సూర్యగ్రహణం- సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటలకు వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. అలాగే నవంబరు 8న చంద్రగ్రహణం- మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటలవరకు చంద్రగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.