మరో రెండు గ్యారెంటీలను ప్రకటించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం..?

ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే రెండు కీలక హామీలను అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర సర్కార్..ఇప్పుడు మరో రెండు పధకాలను ప్రవేశ పెట్టేందుకు సీఎం రేవంత్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది.. ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుదిరితే రేపు ఇంద్రవెల్లి లో జరిగే భారీ బహిరంగ సభలో ఈ పథకాలకు సంబంధించి తీపి కబురు తెలిపే ఛాన్స్ ఉంది.