పాదయాత్రలో కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి

‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర లో భాగంగా కేసీఆర్ ఫై , సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. 2001లో పార్టీ పెట్టకముందు రబ్బరు చెప్పులులేని కేసీఆర్ కుటుంబ సభ్యులకు హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల ఫామ్ హౌజ్‌లు ఎలా వచ్చాయని..? పేదలకు ఇళ్లు కట్టివ్వలేనివాళ్లు హైదరాబాద్‌ నడిబొడ్డున పది ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించుకుని భోగాలు అనుభవిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 2వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో 150 గదుల ప్యాలెస్‌ను ఎందుకు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు.

ప్రగతిభవన్‌ను గడీలతో పోల్చిన రేవంత్‌… అక్కడ ఎప్పటికీ పేదలకు న్యాయం జరగదన్నారు. సామాన్యులకు ప్రవేశం లేని ప్రగతిభవన్‌‌ను నక్సలైట్లు గడీలను గ్రానైడ్స్‌తో పేల్చినట్లు.. పేల్చివేయాలని.. ఇలా చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. తొమ్మిదేళ్ల పాలనలో 23 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఆ సొమ్మంతా ఎక్కడికి మళ్లించారో ప్రజలకు చెప్పాలన్నారు. 2024 జనవరి 1 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వుంటుందని ధీమా వ్యక్తం చేసారు రేవంత్.

ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రాణహాని తలపెట్టేలా నక్సలైట్లకు పిలుపునిచ్చారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ములుగు, నర్సంపేటల్లో బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదులు చేశారు. రేవంత్‌, సీతక్కపై కుట్ర కేసు నమోదు చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.