కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

Twelve from Andhra Pradesh killed in road accident in Chikkaballapura

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందినవారిగా గుర్తించారు. గోరంట్ల నుంచి కర్ణాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన చిక్ బళ్లాపూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి కుటుంబాలు బెంగళూరులోని హొంగసంద్రలో నివాసముంటున్నట్లు తెలిసింది. టాటా సుమోలో ప్రయాణిస్తున్న వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.ఓ చిన్నారి సహా 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు మరణించారు. వాహనంలో ఉన్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.