లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్‌: రేవంత్ రెడ్డి

revanth-reddy-comments-on-brs

హైదరాబాద్‌ః తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలం మధు గెలవాలన్నారు.

తనతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్‌లోకి వెళతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఇందిరమ్మ అనేక పరిశ్రమలను ఇచ్చారన్నారు. అందుకే దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతోమంది బతుకుతున్నట్లు చెప్పారు.