అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతాం – రేవంత్
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/11/revanth-SGP-jpg.webp)
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన దూకుడు ను కనపరుస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా కాంగ్రెస్ విజయయాత్ర పేరిట అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ హామీలను ప్రజలకు వివరిస్తూ..కేసీఆర్ పాలనపై విమర్శలు , ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా సంగారెడ్డి నియోజకవర్గం ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని… 80 సీట్ల వరకు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు. ప్రగతిభవన్ తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసం మాత్రమేనని… అందులోకి అందరికీ అనుమతులు ఇవ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ ప్రగతి భవన్ లోకి ఈజీగా వచ్చేలా అనుమతులు ఇస్తామని తెలిపారు.
అలాగే ఈరోజు రేవంత్ దుబ్బాక, హుజూరాబాద్, మానకొండూర్, మహేశ్వరం, ఎల్బీ నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు దుబ్బాక.. మధ్యాహ్నం 12.30 గంటలకు హుజూరాబాద్.. 2 గంటలకు మానకొండూర్.. 3 గంటలకు మహేశ్వరం కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ నగర్.. 5 గంటలకు ముషీరాబాద్లో ఏర్పాటు చేసే కార్నర్ మీట్లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు.