ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ కలకలం..

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాని మోడీ అధికారిక నివాసంపై డ్రోన్ సంచారం కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని భద్రతను నిర్ధారించే పనిలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు డ్రోన్‌ను చూసినట్టుగా పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు డ్రోన్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రధాని నివాసం పైనున్న నో ఫ్లయింగ్ జోన్‌లో డ్రోన్‌ను ఎగురుతున్నట్లు సమాచారం అందిందని.. ఎస్పీజీ అధికారులు ఉదయం 5:30 గంటలకు పోలీసులను సంప్రదించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మరో కొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.